Tuesday, March 03, 2026

సీఎం కప్–2025లో మెరిసిన సంగారెడ్డి ఈతగాళ్లు రెహమాన్‌ – ఉజైర్‌కు రజత, కాంస్య పతకాలు

 

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం

సంగారెడ్డి, మార్చి 2(SNM న్యూస్): రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ విశిష్ట విజయాలు సాధించారు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో  నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెండవ ఎడిషన్ సీఎం కప్–2025 స్విమ్మింగ్ పోటీలలో మహమ్మద్ అబ్దుర్ రెహమాన్, ఉజైర్ పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు.‌ సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోకా శ్రీవాణి హై స్కూల్‌కు చెందిన విద్యార్థి ముహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్ధిఖ్ గ్రూప్–2 విభాగంలో 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ పోటీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే కరుణ హై స్కూల్‌కు చెందిన విద్యార్థి ఉజైర్ గ్రూప్–3 విభాగంలో బ్రెస్ట్ స్ట్రోక్ పోటీలో రజత పతకం, ఫ్లై ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించి ద్విగుణ విజయాన్ని నమోదు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య విజేతలను అభినందిస్తూ వారి చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి క్రీడాకారులను  అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడం  సీఎం కప్  యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి అఖిలేష్ రెడ్డి క్రీడాకారులను అభినందిస్తూ, క్రమబద్ధమైన సాధనతో ముందుముందు జాతీయ స్థాయిలోనూ రాణించాలని సూచించారు. కఠినమైన పోటీ వాతావరణంలో శ్రద్ధ, పట్టుదలతో పోటీపడి ఈ విజయాలను అందుకోవడం అభినందనీయమని అన్నారు. జిల్లా స్విమ్మింగ్ ఇంచార్జ్ శేషు కుమార్ కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇతర జాతీయ స్థాయిలోనూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...