సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 4 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డును సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాంగరి ప్రవీణ్ తెలిపారు. తాను ఎన్నికైతే అదనపు నిధులు సమకూర్చి వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం 12వ వార్డులో ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం, వీధిదీపాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వరకు చేరేలా చర్యలు తీసుకుంటామని, వార్డు అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నప్పటికీ, ప్రజాసేవ పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నానని, తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత పాల్గొన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందన తనకు మరింత ఉత్సాహాన్నిస్తోందని గులాంగరి ప్రవీణ్ తెలిపారు.

No comments:
Post a Comment