భూత్కూర్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మొక్కల నాటకాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్న వేళ, భూత్కూర్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఇప్పటికే నాటిన మొక్కలను కారణం లేకుండా నరికివేయడం బాధాకరమని గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ అభ్యర్థి తలారి శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను పెంచాల్సిన సమయంలో వాటిని నరికివేయడం సమంజసం కాదన్నారు. పర్యావరణంపై కనీస అవగాహన లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది, పాలకవర్గం వ్యవహరించడం విచారకరమని విమర్శించారు. చెట్లను నరికివేయడమే అభివృద్ధి కాదని, గ్రామ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా గ్రామపంచాయతీ పాలకవర్గం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకుని, గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే గ్రామ ప్రజలతో కలిసి తగిన విధంగా స్పందించేందుకు సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.

No comments:
Post a Comment