సంగారెడ్డిలోని జీఆర్కే ఫంక్షన్ హాలులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.రాఘవరెడ్డి విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉద్యోగులకు ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలుకాకపోవడం బాధాకరమని అన్నారు. కార్యాలయాల్లో కుర్చీలు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కోరారు. అలాగే 2017 సంవత్సరానికి చెందిన 20 అంగన్వాడీ కేంద్రాల ఉద్యోగుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఉద్యోగులకు బస్సు ప్రయాణ రాయితీలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, పింఛన్ సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఉద్యోగుల తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన పూర్ణ వనిత మాట్లాడుతూ, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కోసం 200 గజాల స్థలంలో భవన నిర్మాణానికి చర్యలు తీసుకునేలా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఉద్యోగులు సమాజానికి అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు. అనంతరం సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగులు తొలిసారిగా ఒక వేదికపై సమావేశం కావడం ఆనందదాయకమని అన్నారు. పింఛన్లు సక్రమంగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంఘటితంగా ముందుకు సాగుతున్న ఉద్యోగుల కృషిని ఆయన ప్రశంసించారు.

No comments:
Post a Comment