Thursday, December 18, 2025

ఉపాధి హామీని నిర్వీర్యం చేసే బిల్లును రద్దు చేయాలి -సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

 


సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబర్ 18 (SNM NEWS):
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం - 2005ను నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన వీబీ-జిఆర్ఎఎంజి- 2025 (197) బిల్లును తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 19, 20 తేదీల్లో ప్రతి గ్రామంలో బిల్లు ప్రతులను దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.నేడు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 'వికసిత్ భారత్-2047' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే.. ఉపాధి హామీ చట్టం తలలేని మొండెంలా మారుతుందని తీవ్రంగా విమర్శించారు. పనిదినాలను 125 రోజులకు పెంచుతున్నట్టు చెప్పి, 60 రోజులు పనులపై నిషేధం విధించడం ద్వారా కార్మికులను మోసం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఉపాధి హామీ నిధుల్లో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా ఉండేదని, కొత్త బిల్లులో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం ద్వారా చట్టాన్ని ఎత్తివేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పనులను నాలుగు విభాగాలుగా చేసి కోట్ల రూపాయల పనులను యంత్రాలు, కాంట్రాక్టర్లకు అప్పగించడమే ఈ బిల్లుకు అసలైన ఉద్దేశమని విమర్శించారు. కేంద్రం నిర్ణయించిన వేతనాల కంటే రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా ఉండాలన్న నిబంధనను కొత్త బిల్లులో రద్దు చేశారని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచే విధానాన్ని తొలగించారని పేర్కొన్నారు.. ఆధార్, బయోమెట్రిక్, ఏఐ, జీపీఎస్లలను చట్టబద్ధం చేయడం ద్వారా పేదలను ఉపాధి హామీ నుంచి తప్పించాలన్న ప్రయత్నమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పంచాయతీలకు ఉన్న ప్రధాన పాత్రను తొలగించి, అన్ని అధికారాలను కేంద్రానికి కట్టబెట్టడం, సోషల్ ఆడిట్ను కూడా మనుషులు కాకుండా టెక్నాలజీతో చేయాలనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల భూముల అభివృద్ధి, కాలనీలు, నివాస ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడిన ఉపాధి హామీ నిధుల ప్రస్తావన కూడా కొత్త బిల్లులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామాల్లో ఉపాధి పనిదినాలు తగ్గిపోవడంతో పేదలు జీవించలేని పరిస్థితి నెలకొందని, ఉన్న ఉపాధిని కూడా హరించే ఈ బిల్లును పూర్తిగా రద్దు చేసి, పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.


No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...