Sunday, June 21, 2026

రూ.500 కోట్లతో కింది బజార్ చెరువు సుందరీకరణకు ప్రణాళికలు


పనుల పురోగతిని పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, హెచ్‌ఎండీఏ, ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు

సంగారెడ్డి జూన్ 20: సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ చెరువును రూ.500 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రణాళికలకు మరింత వేగం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, చేపట్టాల్సిన పనులపై విస్తృతంగా చర్చించారు. సుమారు కిలోమీటరున్నర పొడవున ఉన్న చెరువు కట్టను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయడం, నెక్లెస్ రోడ్ నిర్మాణం, పార్కుల ఏర్పాటు, ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై అధికారులతో సమీక్షించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే సందర్శకులను ఆకట్టుకునే విధంగా కింది బజార్ చెరువును అభివృద్ధి చేయాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగేలా అవసరమైన ప్రతిపాదనలు, పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సమీక్ష సమావేశం అనంతరం జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి కింది బజార్ చెరువు కట్ట ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అలుగు సమీపంలోని ప్రభుత్వ భూములను సందర్శించి, వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను గుర్తిస్తూ అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు అమలులో నాణ్యతతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

No comments:

Post a Comment

ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకేలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  ఎద్దుమైలారం, జూన్ 21: ఎద్దుమైలారంలోని ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకే ఎస్టేట్ పరిధిలోని శరత్ యోగా కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా న...